చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో జరిగిన ఉత్కంఠభరిత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఓ బిల్డింగ్లోకి ప్రవేశించి తుపాకులతో హల్చల్ చేసిన దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పోలీసులతో పాటు ఆక్టోపస్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్లో ఐదుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారైనట్లు సమాచారం. అయితే ఈ ఎపిసోడ్లో దొంగలు వాడిన తుపాకులు డమ్మీవేనని తేలడం విశేషం.
అర్ధరాత్రి దాటాక, ఏడుగురు దొంగల ముఠా గాంధీ రోడ్డులోని పుష్ప కిడ్స్ వరల్డ్ షాపులో చొరబడి, షాప్ యజమానిని బెదిరించారు. యజమాని కాస్త తెలివిగా వ్యవహరించి, వారిని లోపల లాక్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆక్టోపస్ పోలీసులు రంగంలోకి దిగారు. దొంగలు డమ్మీ తుపాకులతో కాల్పులు జరుపుతామంటూ బెదిరించినా.. పోలీసులు మాత్రం చాకచక్యంగా వ్యవహరించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఈ ఆపరేషన్ జరుగుతున్నంత సేపు గాంధీరోడ్డు పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ ఘటన స్థలానికి ఎస్పీ మణికంఠ చేరుకొని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా, చుట్టుపక్కల భవనాలను ఖాళీ చేయించారు. బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు ధరించిన పోలీసులు లోపలికి వెళ్లి, ఆపరేషన్ విజయవంతంగా ముగించారు. పక్కనే ఉన్న బ్యాంకులో దోపిడీ కోసమే ఈ దొంగల ముఠా వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.