తెలంగాణలోని జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్పై అవినీతి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బొగ్గులకుంటలో ఉన్న తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు పెద్దఎత్తున నిరసన జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తకోట ఆశ్రమ అర్చకుడు శివానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరై, జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలంటూ మాట్లాడారు.
ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై గత మూడు నెలలుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడం పట్ల భక్తులు, సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలోని ఆభరణాల మాయం, పూజారి, ఈఓల అవినీతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని వారు డిమాండ్ చేశారు.
మంత్రి కొండా సురేఖ స్పందన
ఆందోళన అనంతరం హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మినిస్టర్ క్వార్టర్స్లో కలిశారు. పూజారి ఆనంద్ శర్మను వెంటనే విధుల నుండి తప్పించాలని కోరారు. అరగంట పాటు అర్చకులు, స్వామిజీలు చెప్పిన విషయాలు విన్న మంత్రి, ఆలయ ప్రతిష్టను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆనంద్ శర్మపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కమిషనర్ను ఆదేశించారు.