ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు పరాభవం ఎదురైంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు టీచర్ల పట్టం కట్టారు. రెండో ప్రాధన్యత ఓట్ల లెక్కింపులో గాదె శ్రీనివాసులు గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరిగిందని స్పష్టంగా అర్థమవుతోంది.
ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందా..
కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే ప్రభుత్వంపై టీచర్లలో వ్యతిరేకత పెరిగినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. కూటమి పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల కోసం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్చార్జీలను సైతం నియమించారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ కోసం పీఆర్టీయూ తరఫున బరిలో నిలిచిన గాదె శ్రీనివాసులు నాయుడుకు పోటీగా అధికార టీడీపీ, జనసేన, బీజేపీలు రఘువర్మను ఎంపిక చేశాయి. ఆయనకు అన్ని రకాలు అధికారపక్షం నుంచి సహాయ సహకారాలు అందినప్పటికీ గాదె శ్రీనివాసులు చేతిలో ఓటమి చవిచూశారు.
బోర్లాపడ్డ రఘువర్మ
తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ కూటమి అభ్యర్థి రఘువర్మ వెనుకంజలో కొనసాగారు. బ్యాలెట్ ఓటింగ్లో సైతం బోర్లాపడ్డారు. రఘువర్మ ఓటమి చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల్లో నెలకొన్న వ్యతిరేకతను చూపుతోంది. ఎన్నికల్లో గెలిచాక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను కూటమి మోసం చేసిందని, కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడం, ఐఆర్, పీఆర్సీ ఊసెత్తకపోవడం టీచర్ ఎమ్మెల్సీ ఓటమి కారణాలుగా తెలుస్తోంది.