‘మా ప్ర‌భుత్వం వ‌స్తుంది, త‌ప్పు చేసిన వారి బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తాం’.. – వైఎస్ జ‌గ‌న్

'మా ప్ర‌భుత్వం వ‌స్తుంది, త‌ప్పు చేసిన వారి బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తాం'.. - వైఎస్ జ‌గ‌న్

కూట‌మి అధికారంలోకి రాగానే వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీని చంద్ర‌బాబు టార్గెట్ చేశాడ‌ని, సంబంధం లేక‌పోయినా కేసులో ఇరికించాడ‌ని, వంశీ అరెస్టు లా అండ్ ఆర్డ‌ర్ బ్రేక్ డౌన్ అని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. విజ‌య‌వాడ జిల్లా జైల్‌లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని వైఎస్ జ‌గ‌న్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జైల్లో ఉన్న వంశీకి ధైర్యం చెప్పిన అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు.

2023 ఫిబ్ర‌వ‌రి 19న‌ చంద్ర‌బాబు ఆదేశాల‌తో టీడీపీ నేత ప‌ట్టాభీ వంశీని ఉద్దేశించి వాడో పిల్ల సైకో, నేనే గ‌న్న‌వ‌రం వెళ్తా, ఎవ‌డేం పీకుతాడో చూస్తాం, ఆ వంశీ సంగ‌తి తేలుస్తా, నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు విసిరేస్తా అని రెచ్చ‌గొట్ట‌డం మూలంగానే, మ‌రుస‌టి రోజు ఫిబ్ర‌వ‌రి 20న‌ గ‌న్న‌వ‌రం వైసీపీ ఆఫీస్‌పై మొద‌ట ప‌ట్టాభీ దాడికి య‌త్నించ‌డం కార‌ణంగానే ప్ర‌తిచ‌ర్య‌గా టీడీపీ ఆఫీస్‌పై దాడి జ‌రిగింద‌ని, ప‌ట్టాభీ ఓవ‌ర్ యాక్ష‌న్ కార‌ణంగా ద‌ళిత సీఐ క‌న‌క‌రావు త‌ల‌కు గాయ‌మైంద‌న్నారు.

తెల్ల‌కాగితం మీద సంత‌కం చేయించుకొని..
2023 ఫిబ్ర‌వ‌రి 22న‌, ఘ‌ట‌న జ‌రిగిన రెండ్రోజుల త‌రువాత గ‌న్న‌వ‌రం టీడీపీ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌త్య‌వ‌ర్ధ‌న్‌ను చంద్ర‌బాబు మంగ‌ళగిరి ఆఫీస్‌కు పిలిపించుకొని, తెల్ల‌కాగితం మీద సంత‌కం చేయించుకున్నాడ‌ని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. అత‌ని పేరు మీద బ‌ల‌వంతంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించాడ‌న్నారు. స‌త్య‌వర్ధ‌న్‌ అనే వ్య‌క్తి దాడి ఘ‌ట‌న‌తో వంశీకి ఎలాంటి సంబంధం లేద‌ని, త‌న‌ను ఎవ‌రూ దూషించ‌లేద‌ని, ఘ‌ట‌న జ‌రిగే స‌మ‌యంలో తాను అక్క‌డ లేన‌ని 2023 ఫిబ్ర‌వ‌రి 23న తీసుకున్న 161 స్టేట్‌మెంట్‌లో చెప్పాడ‌న్నారు. ఇదే విష‌యాన్ని స‌త్య‌వ‌ర్ధ‌న్ అనే వ్య‌క్తి ఇటీవ‌ల సాక్ష్యాత్తు న్యాయ‌మూర్తి ముందు అంగీక‌రించినా, వంశీపై త‌ప్పుడు కేసులు బ‌నాయించారని వైఎస్ జ‌గ‌న్ మండిప‌డ్డారు.

వంశీ పేరు లేక‌పోయినా టార్గెట్ చేశారు..
దాడి జ‌రిగిన స‌మ‌యంలో టీడీపీ ఇచ్చిన మూడు ఫిర్యాదుల్లో వంశీ పేరు ఎక్క‌డా లేద‌న్నారు. అయినా, చంద్ర‌బాబు అధికారంలోకి రాగానే, వంశీని టార్గెట్ చేశారని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. 2024 జులై 10న కేసును రీఓపెన్ చేయించి ఎలాగైనా వంశీని ఈ కేసులో ఇరికించాల‌ని 71వ నిందితుడిగా చేర్చారు. ఇవ‌న్నీ కూడా బెయిల‌బుల్ అఫెన్స్‌లు కాబ‌ట్టి, బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్ర‌యించాడు కాబ‌ట్టి, గ‌న్న‌వ‌రం పార్టీ ఆఫీస్‌ఎస్సీ, ఎస్టీల‌కు సంబంధించిన బిల్డింగ్ అని దొంగ వాంగ్మూలం ఇప్పించాడు. ఆ టీడీపీ ఆఫీస్ క‌డియాల సీతారాం అనే వ్య‌క్తిది అని, అత‌ను ఎస్సీ, ఎస్టీ, ఆఖ‌రికి బీసీ కూడా కాదు.. చంద్ర‌బాబుకు సంబంధించిన వ్య‌క్తి అని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. వంశీకి బెయిల్ రానివ్వ‌కుండా ఉండాల‌ని ఆ బిల్డింగ్ ఎస్సీ, ఎస్టీల‌కు సంబంధించింద‌ని త‌ప్పుడు వాంగ్మూలం ఇప్పించాడన్నారు.

ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్టం..
చంద్ర‌బాబు న‌మోదు చేస్తున్న త‌ప్పుడు కేసుల‌పై న్యాయ‌పోరాటం చేస్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, అన్యాయం చేసిన అధికారుల‌ను, నాయ‌కుల‌ను బ‌ట్ట‌లూడ‌దీసి నిల‌బెడ‌తామ‌ని వైఎ జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని చెప్పారు. వంశీని అరెస్టు చేసిన సీఐ తాను ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రంలో రిటైర్డ్ అవుతాన‌ని చెప్పాడ‌ట.. రిటైర్డ్ అయినా కూడా స‌ప్త‌స‌ముద్రాల అవ‌త‌ల ఉన్నా.. అంద‌రినీ పిలిపిస్తామ‌ని, చ‌ట్టం ముందు నిల‌బెడ‌తాం.. త‌ప్పుచేసిన వారి బ‌ట్ట‌లు ఊడ‌దీస్తామ‌ని హెచ్చ‌రించారు. బాధితుల‌కు న్యాయం జ‌రిగేలా చేస్తామ‌న్నారు. అధికారులు ఎవ‌రూ అన్యాయంలో భాగ‌స్వాములు కావొద్దు.. టోపీపై ఉన్న మూడు సింహాల‌కు సెల్యూట్ కొట్టండి.. మీ వ్య‌క్తిత్వాన్ని కాపాడుకోండి అని అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాం అని వైఎస్ జ‌గ‌న్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment