ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జీబీఎస్ మరణం చోటుచేసుకుంది. గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వైరస్ బారినపడి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న మహిళ సోమవారం మృతిచెందింది. మృతిచెందిన మహిళ ఎల్. కోట మండలం, మలేవీడు గ్రామానికి చెందిన రేణుక మహంతిగా గుర్తించారు. గురువారం ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని, ఛాతీలో నొప్పి తీవ్రం కావడంతో పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
గుంటూరులో ఆదివారం తొలి గులియన్ బారే సిండ్రోమ్ మరణం నమోదైన విషయం తెలిసిందే. జీబీఎస్ బారినపడి గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఆలసందలపల్లికి చెందిన మహిళగా ఆదివారం సాయంత్రం మృత్యువాతపడ్డారు.
ఏపీలో వరుసగా జీబీఎస్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు 17 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మరిన్ని కేసులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల సమాచారం మేరకు జీబీఎస్ కేసులు రాష్ట్రంలోని ఆరు ప్రధాన జిల్లాల్లో నమోదయ్యాయి. గుంటూరులో 5, విశాఖపట్నంలో 5 కేసులు, కాకినాడలో 4, విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు నమోదైనట్లు సమాచారం.