విశాఖపట్నం దువ్వాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోంది.
పోలీసు కేసు నమోదు
ర్యాగింగ్ వ్యవహారం పోలీసు స్టేషన్ వరకు వెళ్లడంతో, అధికారులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఘటనపై బీఎన్ఎస్ 324 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులకు భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం నిర్ణయించింది.
పాడేరులోని స్కూల్లో..
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని సెయింట్ ఆన్స్ స్కూల్ హాస్టల్లో ర్యాగింగ్ ఘటన కలకలం సృష్టించింది. ఏడో తరగతి బాలికపై టెన్త్ స్టూడెంట్స్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాలికపై దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థినులను హాస్టల్ నుంచి ఇంటికి పంపేయాలని స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది.