విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైసీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రేపు జరగనున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ చేస్తున్న దౌర్జన్యకాండను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కోరారు.
వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలతో అధికార టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రేపు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుందని, వైసీపీ తరఫున శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్ధిని ప్రకటిస్తే అతని ఆస్తులను కూల్చేసి భయభ్రాంతులకు గురిచేశారన్నారు. అతను పోటీచేయడానికి వీల్లేదన్నట్లుగా బెదిరించారన్నారు.
రాజీనామాలు చేసి వస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటామని చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారని, కార్పొరేటర్ల విషయంలో అది వర్తించదా..? వైసీపీ గుర్తుపై గెలిచిన వారిని ప్రలోభపెట్టి లాక్కోవడం దుర్మార్గం కాదా..? అని ప్రశ్నించారు. తాము విప్ జారీ చేశామని, ఎవరైనా అది ఉల్లంఘిస్తే డిస్క్వాలిఫై అవుతారన్నారు. నిజాయితీ గా పనిచేసే అధికారులను నియమించి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ని కోరినట్లు చెప్పారు.








