ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు నిర్వహించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వే ప్రకారం, సుమారు 7 లక్షల లబ్ధిదారుల్లో 40 శాతం మంది అనర్హులుగా ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, నకిలీ సర్టిఫికెట్లు చూపించి పెన్షన్ పొందుతున్న వారి లిస్టును సమీక్షించి, వారి సాయం రద్దు చేయనున్నట్లు సమాచారం. రెండు రోజుల్లోనే ఈ వైద్య పరీక్షలను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ చర్య వల్ల నిజమైన అర్హులు ప్రయోజనం పొందుతారని, ప్రభుత్వ నిధులు సరైన ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయని ప్రభుత్వం చెబుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పెన్షన్ల కోత మొదలైందని, నెలనెలా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుందని ఇటీవల ది న్యూస్ మినిట్ వెబ్సైట్ సంచలన కథనాన్ని లెక్కలతో సహా పబ్లిష్ చేసిన విషయం తెలిసిందే. లబ్ధిదారులు సైతం ప్రభుత్వ చర్యను తప్పుబడుతున్నారు.