ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొదలైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ నేతలు నారా లోకేశ్కు ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్పై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
లోకేశ్కు ప్రమోషన్ ఉంటుందా..?
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైజాగ్ పర్యటన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్కు ఆ పర్యటనతో శాఖ పరమైన సంబంధాలు లేకపోయినా పత్రికా ప్రకటనల్లో చినబాబు ఫొటో దర్శనమిచ్చింది. ఈ యాడ్స్లో ప్రధాని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో పాటు లోకేశ్ కూడా అచ్చేపించారు. ఆ ప్రకటన కంటే ముందు నుంచే పార్టీ పరంగా సెల్ఫ్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. లోకేశ్ వల్లే సభ్యత్వాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయనే మాట ఇటీవల టీడీపీ శ్రేణుల వ్యాఖ్యల్లో వినిపిస్తోంది. తాజాగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలోనూ లోకేశ్ బొమ్మతో పలు మీడియా ఛానళ్లలో ప్రకటనలు వెల్లువెత్తాయి. తన శాఖ పరమైన సంబంధాలు లేకపోయినా లోకేశ్ను ప్రభుత్వ ప్రకటనల్లో ఇంప్లీడ్ చేస్తున్నారంటే కచ్చితంగా ప్రమోషన్ ఇవ్వడానికేనని టీడీపీ నేతల అభిప్రాయం.
వారికి మింగుడుపడని పవన్ వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్నప్పటికీ ఆయన తన వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా ప్రవర్తిస్తున్నారని, ప్రతిపక్షాల నుంచి వచ్చే వారిని తన పార్టీలో చేర్చుకొని వారికి ఆశ్రయం కల్పిస్తున్నారని ఇటీవల టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కట్టడాల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడం, ప్రభుత్వ స్కూళ్లను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు మింగుడుపడకుండా చేశాయి. పవన్ కళ్యాణ్ ప్రజల్లో తన పరపతిని పెంచుకుంటున్నారని గ్రహించిన టీడీపీ.. తెరపైకి లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ను తెచ్చింది. టీడీపీ డిమాండ్పై జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. తమ నాయకుడికి సమానంగా మరో పదవి ఉండకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
శ్రీనివాస్రెడ్డి ప్రపోజల్..
తాజాగా చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్రెడ్డి లోకేశ్కు ప్రమోషన్ ఇవ్వాలని, డిప్యూటీ సీఎంను చేస్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని ఒక ప్రపోజల్ను చంద్రబాబు ముందు ఉంచారు. మూడో తరం నేత పార్టీలోకి వచ్చారు.. యువతకు, పార్టీకి భరోసా ఇవ్వాన్నా.. నారా లోకేశ్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని అందరం కోరుకుంటున్నాం.. అది మా కోరిక అంటూ చంద్రబాబుకు విన్నవించారు.
పదవి అంశం దారితీస్తోన్న రాజకీయ మలుపు
నారా లోకేశ్ డిప్యూటీ సీఎం అవ్వాలనే టీడీపీ నేతల ఆకాంక్ష రాజకీయ వాతావరణంలో హాట్ టాపిక్గా మారింది. అధికారం చేపట్టిన అనంతరం వైసీపీ హయాంలో మాదిరిగా నాలుగైదు డిప్యూటీ సీఎంలు ఉండవని, పవన్ ఒక్కరే డిప్యూటీ సీఎం అని ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? జనసేన-టీడీపీ మిత్రపక్షాల మధ్య ఈ వివాదం కూటమి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అనేది చర్చనీయాంశంగా ఉంది.