కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండపై మాంసాహారం కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన భక్తులు 18 మంది బృందం గా వచ్చి మాంసాహారం తినడంపై వివాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు, శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకొని కోడిగుడ్లు, పలావ్ తినడం అక్కడి భక్తులను ఆశ్చర్యపరిచింది.
అలిపిరి నుంచి రాంభగిచా బస్టాండ్ వరకు
ఈ భక్తబృందం అలిపిరి నుంచి తిరుమలకు చేరుకుని, రాంభగిచా బస్టాండ్ ఆవరణలో మాంసాహారం తింటూ కనిపించారు. ఇది తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యగా భావించిన ఇతర భక్తులు, వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. తిరుమలలో మాంసాహారం తినడం పూర్తిగా నిషిద్ధం అని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) స్పష్టంగా పేర్కొంది. ఈ క్రమంలో భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేసిన పోలీసులు, వారిని టీటీడీ నియమాలు వివరించి హెచ్చరించారు.
తిరుమల పవిత్రతపై శ్రద్ధ అవసరం
తిరుమలలో వెజిటేరియన్ ఆహారం మాత్రమే అనుమతించబడుతుంది. భక్తులు తమ ప్రవర్తనలో జాగ్రత్తలు తీసుకుని, తిరుమల పవిత్రతకు భంగం కలిగించకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.








