బ్రిటన్ అవినీతి నిరోధక శాఖ మంత్రిగా ఉన్న తులిప్ సిద్ధిఖీ, తన పదవికి రాజీనామా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబంతో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆరోపణలు రావడం ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. తులిప్ సిద్ధిఖీ, షేక్ హసీనా సోదరి రెహానా కుమార్తె కావడం గమనార్హం.
ఆర్థిక ఆరోపణలపై బ్రిటన్ ప్రభుత్వ స్పందన
42 ఏళ్ల తులిప్ పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆమె వాటిని మొదటి నుంచి ఖండిస్తున్నారు. లేబర్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెకు ఆర్థిక సేవల పాలసీ శాఖ బాధ్యత అప్పగించారు. ఈ శాఖ మనీలాండరింగ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. తాను మినిస్టీరియల్ కోడ్ను ఉల్లంఘించలేదని, ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని స్వతంత్ర సమీక్ష తేల్చినప్పటికీ, ఆర్ధిక అనుమానాల నేపథ్యంలో నైతికతకు ప్రాధాన్యం ఇస్తూ తులిప్ రాజీనామా చేశారు.
బంగ్లాదేశ్లో హసీనా కుటుంబంపై దర్యాప్తు
బంగ్లాదేశ్ ప్రభుత్వం 12.65 బిలియన్ డాలర్ల అణువిద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేపట్టింది. హసీనా కుటుంబం ఇందులో లబ్ధి పొందిందని ఆరోపణలున్నాయి. తులిప్ సిద్ధిఖీ కూడా ఈ వివాదంలో ప్రత్యక్షంగా లేకపోయినా, హసీనా కుటుంబంతో సంబంధాల కారణంగా ఆమె పేరు చర్చకు వచ్చింది.
తులిప్ నివాసం. ఆస్తుల వివాదం..
తూర్పు లండన్లో 2009 నుండి తులిప్ నివసిస్తున్న ఇంటి విషయంలో కూడా వివాదం ఉత్కంఠ రేపుతోంది. అది బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి నుంచి వచ్చినదని, అలాగే 2004లో ఆమె పొందిన ఆస్తి హసీనా పార్టీకి చెందిన వ్యక్తికి సంబంధించినదని ఆరోపణలున్నాయి.