శ్రీలంక నావికాదళం మరోసారి భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి మన్నార్ సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తున్న ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసి, రెండు ఫిషింగ్ ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీలంక నేవీ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
2025లో ఇప్పటివరకు 18 మంది అరెస్టు
శ్రీలంక నేవీ ప్రకటన ప్రకారం.. ఈ అరెస్టుతో 2025లో అరెస్టు చేసిన భారతీయ మత్స్యకారుల సంఖ్య 18కు చేరింది. పట్టుబడిన పడవలతో పాటు మత్స్యకారులను ఇరానతీవు ద్వీపానికి తరలించి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం కిలినొచ్చిలోని అసిస్టెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిషరీస్కు అప్పగించనున్నారు.
భారత్-శ్రీలంక మత్స్యకారుల వివాదం
భారత్, శ్రీలంక మధ్య మత్స్యకారుల సమస్య ఏటా వివాదాస్పదంగా మారుతోంది. పాక్ జలసంధిలో శాంతి భద్రతలకు భంగం కలిగించారనే కారణంతో శ్రీలంక నేవీ తరచుగా భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేస్తోంది. 2024లో 529 మంది భారతీయ మత్స్యకారులు అరెస్టు అయ్యారు. శ్రీలంక పడవల స్వాధీనం చేసుకోవడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.