సాధారణంగా కరెంట్ బిల్లు కొంచెం ఎక్కువ వస్తేనే నిద్రపట్టదు. కానీ, హిమాచల్ ప్రదేశ్లోని ఓ వ్యాపారికి ఏకంగా రూ. 210 కోట్ల కరెంట్ బిల్లు రావడంతో అతను షాక్ తిన్నాడు. హమీర్ పూర్ జిల్లా జట్టాన్ గ్రామానికి చెందిన వ్యాపారి లలిత్ ధిమాన్కు ప్రతినెల సుమారు రూ. 3,000 వరకు కరెంట్ బిల్లు వస్తుంటుంది. అయితే, ఈసారి అతనికి ఏకంగా రూ. 210,42,08,405 బిల్లు వచ్చింది. దీంతో ఆ చిరు వ్యాపారి షాక్కు గురయ్యాడు.
ఆఫీస్కు వెళ్తే సమస్యకు పరిష్కారం
అవాక్కయిన లలిత్ ధిమాన్ వెంటనే విద్యుత్ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించిన అధికారులు ఈ భారీ బిల్లు సాంకేతిక లోపం వల్ల వచ్చిందని వెల్లడించారు. అసలైన బిల్లు కేవలం రూ. 4,047 మాత్రమేనని సవరించారు. ఈ సమాచారం విని లలిత్ ధిమాన్ ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో ఇలాంటి సంఘటనలు..
ఇది తొలిసారేం కాదు.. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్లో టైలరింగ్ షాప్ నడిపే వ్యక్తికి రూ. 86 లక్షల బిల్లు వచ్చింది. డిస్కం అధికారులు సమస్యను పరిశీలించగా, మీటర్ రీడింగ్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఈ పొరపాటు జరిగినట్లు తేలింది.
వ్యాపారులు, వినియోగదారుల కోసం సూచనలు
షాక్కు గురిచేసే ఇలాంటివి సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే విద్యుత్ కార్యాలయాన్ని సంప్రదించడం మంచిదని, మీటర్ రీడింగ్ను పర్యవేక్షించి సమస్యను తక్షణమే పరిష్కరించుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.