విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’(Adarsha Kutumbam). భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని గాంధీ జయంతి (Gandhi Jayanthi) సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో బాగా వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రల పరిచయంతో పాటు, వెంకటేష్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ నేపథ్యం వివరించడానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ (NTR Voice Over) ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వాయిస్ ద్వారా కథలోని ప్రధాన కాన్ఫ్లిక్ట్ ను రివీల్ చేస్తే ఆడియన్స్ కథకు మరింత బాగా కనెక్ట్ అవుతారని త్రివిక్రమ్ ఈ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల అక్కినేని అఖిల్ (Akkineni Akhil) నటించిన లెనిన్ (Lenin) సినిమాలోని పాత్రల పరిచయం, కథనం తాలూకు సంభాషణలకు జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) వాయిస్ ఇచ్చారు. ఆ సినిమా హిట్ కావడంతో అదే సెంటీమెంట్ ను ఆదర్శకుటుంబానికి అప్లై చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వార్త నిజమైతే మాత్రం ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంపై అంచనాలు మరింత ఆకాశాన్ని తాకడం ఖాయం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.








