ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు, టీచర్లకు రక్షణ లేకుండా పోతోందనే ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. గుంతకల్లులో ఓ ఉపాధ్యాయురాలిపై కత్తితో దాడి ఘటన కలకలం రేపింది. రాజేంద్రనగర్లోని శ్రీచైతన్య స్కూల్లో పనిచేస్తున్న టీచర్ అరుణపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. స్కూల్లో లంచ్ బ్రేక్ సమయంలో ఉన్న టీచర్ అరుణను ఓ గుర్తుతెలియని వ్యక్తి బయటకు రావాలని పిలిచాడు. దీంతో ఆమె స్కూల్ గేటు బయటకు వచ్చిన వెంటనే ఆ వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. టీచర్ మెడపై కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాడి అనంతరం తీవ్ర రక్తస్రావంతో ఉన్న అరుణను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
టీచర్ అరుణపై దాడి చేసింది ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్గా గుర్తించారు.. గత కొన్ని రోజులుగా అరుణ, శ్రీనివాస్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.








