శ్రీశైలంలో విషాదం.. సత్రంలో ఐదుగురు ఆత్మహత్య

శ్రీశైలంలో విషాదం.. సత్రంలో ఐదుగురు ఆత్మహత్య

Summarize with AI

శ్రీశైల దేవస్థానం పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి టీచర్స్ కాలనీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు, 15 ఏళ్ల బాలుడు ఉన్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి టీచర్స్ కాలనీ వడ్డేర కులానికి చెందిన ప‌ల్ల‌పు సుధాక‌ర్ కుటుంబం గత నెల 28న శ్రీశైలంకు వచ్చింది. వడ్డెర సత్రంలోని 11వ నంబర్ గదిని అద్దెకు తీసుకుంది. సత్రంలోని గదిలో ఉన్న ఐదుగురు రెండు, మూడు రోజులుగా బయటకు రాకపోవడంతో సత్రం సిబ్బందికి అనుమానం వచ్చింది. త‌లుపులు తెరిచి చూసేస‌రికి పల్లపు సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15) ఉరి వేసుకొని విగ‌త‌జీవుల్లా వేలాడుతూ క‌నిపించారు.

దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. గదిలోని హాలులో ఉన్న ఫ్యాన్‌కు ఇద్దరు ఉరేసుకుని కనిపించగా.. స్నానాల గదిలో ముగ్గురు మహిళలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో భక్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment