శ్రీలంకతో (Sri Lanka) జరిగిన గాలే టెస్టులో(Galle Test) భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) సంచలన ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి ఏకంగా 10 వికెట్లు (10 wickets) పడగొట్టి, భారత్(India) 165 పరుగుల భారీ విజయం సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో సుతార్ కీలకంగా వ్యవహరించాడు. తన 21.4 ఓవర్ల కోటాలో 76 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాతో (Ravindra Jadeja) కలిసి పిచ్ను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశాడు.
ఇక రెండో ఇన్నింగ్స్లో సుతార్ మరింత ప్రమాదకరంగా మారాడు. శ్రీలంక బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 23.4 ఓవర్లలో కేవలం 55 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. పిచ్పై లభిస్తున్న టర్న్ను వాడుకుంటూ వరుసగా వికెట్లు తీసి లంకను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. చివరి వికెట్గా కేశర నువంత (Keshara Nuwanth) (20)ను క్విక్కర్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ను ముగించడంతో పాటు, తన కెరీర్లో తొలిసారిగా ఒకే టెస్టులో 10 వికెట్ల మైలురాయిని అందుకొని గాల్లోకి పంచ్ విసురుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
జూన్ 2026లో టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ యువ స్పిన్ సంచలనం, ఇంత తక్కువ సమయంలోనే జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న తీరు అద్భుతం. మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, నెటిజన్లు మానవ్ సుతార్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుతార్ ప్రదర్శించిన క్రమశిక్షణ, లైన్ అండ్ లెంగ్త్ భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని కొనియాడుతున్నారు.







