స్పెషల్ ఇటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్కు (CEC) లేఖ రాశారు. ఇప్పటికే ఈ అంశంపై నాలుగుసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, తమ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోలేదని ఆయన లేఖలో కీలక అంశాలను పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలానికి (Vijayawada Rural Mandal)సంబంధించిన ఓటర్ల జాబితాలో(Voters List) పలు వ్యత్యాసాలు ఉన్నాయని వంశీ ఆరోపించారు. 32,524 మంది ఓటర్లకు సంబంధించిన వ్యత్యాసాల జాబితాను ఇప్పటివరకు తమకు అందించలేదని తెలిపారు. అలాగే విజయవాడ రూరల్ మండలంలోని 24 నుంచి 70 వరకు ఉన్న పోలింగ్ బూత్లలో(Polling Booths) రీ-వెరిఫికేషన్ (Re-verification) ప్రక్రియ నిర్వహించలేదని లేఖలో పేర్కొన్నారు.
ప్రసాదంపాడు ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్లు 58, 59, 53లో ‘నో మ్యాపింగ్’(No Mapping) కేసులు అధికంగా ఉన్నప్పటికీ, వాటిపై అధికారులు ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదని వంశీ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.
ఫోటో ఆధారాలతో ధృవీకరించబడిన బహుళ ఓటరు నమోదు కేసులు (Multiple Voter Registration) వెలుగులోకి వచ్చినప్పటికీ వాటిపై తగిన చర్యలు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియలో ఇలాంటి అంశాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
SIR-2026 ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్రమైన అవకతవకలపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. SIR-2026 ప్రక్రియ ఆగస్టు 30న ముగిసేలోపు తాను లేవనెత్తిన అంశాలపై రాతపూర్వక సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను కోరారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు, రీ-వెరిఫికేషన్, నో మ్యాపింగ్ కేసులు, బహుళ ఓటరు నమోదుపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని వంశీ తన లేఖలో కోరారు.







