ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ గైర్హాజరయ్యారు. వరుసగా మూడోసారి కేబినెట్ భేటీకి పవన్ దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
శాఖాపరమైన సమీక్షలు, కుంకీ ఏనుగులకు స్వాగతం, భోగాపురం బహిరంగ సభ, ఇతర అధికారిక సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్న డిప్యూటీ సీఎం.. కేవలం కేబినెట్ సమావేశాలకు మాత్రమే ఎందుకు రావట్లేదనే అంశంపై రాజకీయ విశ్లేషకులు సైతం లోతుగా ఆలోచించాల్సిన పరిస్థితి.
గతంలో రెండు మంత్రివర్గ సమావేశాల నుంచి ఆరోగ్య పరమైన కారణాలను సాకుగా చూపి మధ్యలోనే వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్.. ఆ తరువాత జరిగిన మరో రెండు కేబినెట్ భేటీలకు హాజరుకాలేదు. తాజాగా జరిగిన సమావేశానికి కూడా రాకపోవడంతో అధికార కూటమిలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలకు హాజరైన పవన్.. సీఎం చంద్రబాబు నిర్వహించే పలు శాఖల సమీక్షా సమావేశాలకు, అలాగే మంత్రివర్గ సమావేశాలకు మాత్రం దూరంగా ఉండటంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో రెండుసార్లు జరిగిన కేబినెట్ భేటీల్లో పాల్గొన్నప్పటికీ, సమావేశం ముగియకుండానే పవన్ కల్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయారు.
పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలకు హాజరుకాకపోవడం వెనుక ఆరోగ్య కారణాలా లేక విధానపరమైన వ్యత్యాసాలా అనే కోణంలో వివిధ విశ్లేషణలు సాగుతున్నాయి. గతంలో అనారోగ్యం, వెన్నునొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరుకాలేకపోయారని లేదా మధ్యలో వెళ్లారని జనసేన వర్గాలు పేర్కొన్నప్పటికీ, వరుసగా మూడోసారి భేటీకి దూరంగా ఉండటంతో విపక్షాలు, రాజకీయ పరిశీలకులు దీనిపై రకరకాల అంచనాలు వేస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అంశం సోషల్ మీడియాలోనూ, అధికార-ప్రతిపక్ష వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రచారంపై జనసేన లేదా టీడీపీ అధిష్టానం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.







