శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం భవిష్యత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగుతుందా.. లేదా అనేది అనుమానమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేరేమోనని అనిపిస్తుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
మోదీ సర్కారులో అస్థిరత నెలకొంటే మహారాష్ట్రలోనూ ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో దర్యాప్తు సంస్థల ఒత్తిళ్లకు భయపడిన ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి మారతారని సంజయ్ పేర్కొన్నారు. కానీ, భయపడని నేతలతో కొత్త శక్తివంతమైన శివసేనను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
డిప్యూటీ సీఎం షిండేపై విమర్శలు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. “షిండేకు తన పార్టీ మీద కూడా నియంత్రణ లేదు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ప్రధాని మోదీ లేదా కేంద్ర హోంమంత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి” అని ఎద్దేవా చేశారు. బాలాసాహెబ్ సిద్ధాంతాలను అనుసరించే శివసేన (యూబీటీ) మాత్రం ఈ విధానాలకు పూర్తి విరుద్ధంగా ఉందని, తమ పార్టీ ఎవరి ముందూ తలవంచబోదని స్పష్టం చేశారు.