గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కాపు సామాజిక వర్గ నేత గూడపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు ప్రధాన అనుచరుడిగా ఉన్న గూడపాటి శ్రీనివాసరావు ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన మద్దతుదారులు, అనుచరులతో కలిసి తాడేపల్లి కార్యాలయానికి చేరుకున్న ఆయన వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీనివాసరావు చేరికతో రేపల్లె పట్టణ పరిధిలో పార్టీ మరింత బలపడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గూడపాటి శ్రీనివాసరావు సహా ఆయన అనుచరులను వైసీపీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.”గూడపాటి శ్రీనివాసరావు రాకతో రేపల్లె నియోజకవర్గంలోపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుంది. నియోజకవర్గంలో మోహన్ను సొంత తమ్ముడిగా భావించి, అందరూ కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.
రేపల్లె నియోజకవర్గంలో కాపు వర్గానికి చెందిన కీలక నేతగా ఉన్న గూడపాటి శ్రీనివాసరావు పార్టీ మారడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గంలో వైసీపీ పటిష్టతకు శ్రీనివాసరావు చేరిక ఊతాన్నిస్తుందని పార్టీ శ్రేణులు తెలుపుతుండగా, స్థానిక సమీకరణాలపై ఈ చేరిక ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.








