హైదరాబాద్ నగరాన్ని మంగళవారం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రికి మరింత ఉధృతంగా మారడంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, కొండాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులపై భారీగా నీరు చేరింది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోవడంతో ఉద్యోగులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక నగరంలో రాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచిన రహదారులపై ప్రయాణించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. మరోవైపు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు రంగంలోకి దిగి నీటి నిల్వలను తొలగించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం వంటి పనులను ముమ్మరం చేశాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రజలు అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.









అర్ష్దీప్-సమ్రీన్ రిలేషన్.. వైరల్ అవుతున్న ఇన్స్టా ఎమోజీలు!