ఉత్తరాంధ్ర కలల స్వప్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport)) క్రెడిట్ (Credit) రాజకీయం తీవ్రస్థాయికి చేరింది. ప్రాజెక్ట్ను రూ.5,600 కోట్లతో నిర్మించిన ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, ఉత్తరాంధ్ర బిడ్డ జీఎంఆర్ను (GMR) కీలక వేదికపై మాట్లాడించకపోవడంపై కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ(YSRCP) గట్టిగా నిలదీస్తోంది.
ఇటీవల జమ్మలమడుగు (Jammalamadugu) జిందాల్ ఉక్కు కర్మాగారం (Jindal Steel Plant) విషయంలోనూ సంబంధిత సంస్థ యజమాని ఎక్స్ లో క్రెడిట్ను గత ప్రభుత్వానికే కట్టబెట్టడంతో ఇరకాటంలో పడ్డ కూటమికి, ఇప్పుడు భోగాపురం ప్రారంభోత్సవం విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందా..? అంటే అవుననే అంటోంది వైసీపీ(YSRCP). ఎయిర్పోర్టు విషయంలో నిజాలు బయటపడతాయనే జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో (Grandhi Mallikarjuna Rao) మాట్లాడించలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.
విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) కూటమి నాయకుల వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గొప్ప పారిశ్రామికవేత్త, ఉత్తరాంధ్రకు చెందిన జీఎంఆర్ రూ.5,600 కోట్లు పెట్టుబడి పెట్టి భోగాపురం ప్రాజెక్ట్ను నిర్మించారు. వేదికపైనే ఉన్న ఆయనకు మాట్లాడే అవకాశం ఎందుకు కల్పించలేదు?” అని అమర్నాథ్ ప్రశ్నించారు.
జీఎంఆర్ మాట్లాడితే అసలు భూసేకరణ ఎవరు చేశారు, ఫైనాన్షియల్ క్లోజర్ ఎప్పుడు జరిగింది అనే వాస్తవాలు బయటకు వచ్చి, కూటమి నేతల ‘క్రెడిట్ చోరీ’ ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే ఆయన నోరు నొక్కారని ఆరోపించారు.
భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన సమయంలో జీఎంఆర్ “గతంలో హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్ విమానాశ్రయానికి ఫౌండేషన్, ప్రారంభోత్సవం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) సమక్షంలో.. నేడు భోగాపురం ఎయిర్పోర్టుకు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమక్షంలో ఫౌండేషన్ వేయడం భగవంతుడి నిర్ణయం” అన్న మాటలను గుడివాడ అమర్ గుర్తుచేశారు.
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ వేదికపై “కొబ్బరికాయ కొట్టింది నేనే.. గుమ్మడికాయ కట్టింది నేనే” అని చంద్రబాబు (Nara Chandrababu Naidu) మాట్లాడడంపై గుడివాడ అమర్ సెటైర్లు వేశారు. మధ్యలో అసలైన నిర్మాణం అంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేశారని, కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అక్కర్లేదు.. దారినపోయే ఎవరైనా చేస్తారని ఎద్దేవా చేశారు. కానీ 2,700 ఎకరాల భూమిని సేకరించి, 130 కి పైగా లీగల్ ఇష్యూస్ పరిష్కరించి, అన్ని రకాల క్లియరెన్సులు తెచ్చి విమానాశ్రయం నిర్మించింది మాత్రం జగన్ ప్రభుత్వమేనని చెప్పారు.








