కర్నూలు (Kurnool) జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, వైసీపీ (YSRCP) సీనియర్ నేత విరూపాక్షిని (Virupakshi) పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చిప్పగిరి (Chippagiri) గ్రామంలోని ఆయన నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్ను (Chandrasekhar) కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త గిరిపై, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడనే కారణంతో నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ(TDP) నేత నాగరాజు(Nagaraju) ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు గిరిపై దాడి చేశారు. ఈ విషయాన్ని బాధితుడు ఎమ్మెల్యే విరూపాక్షికి తెలియజేయడంతో, ఆయన తన సోదరుడు శ్రీరాములు, పార్టీ కార్యకర్తలతో కలిసి నేమకల్లుకు వెళ్లారు.
అక్కడ కూడా టీడీపీ(TDP) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు (Sriramulu) ఎడమచేయి విరిగిందని, పలువురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
అయితే, ఈ ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే అభియోగంతో పోలీసులు ఎమ్మెల్యేపై చర్యలకు దిగినట్లు సమాచారం. వైసీపీ శ్రేణులకు మద్దతుగా వెళ్లిన ఎమ్మెల్యే పట్ల చిప్పగిరి సీఐ రవిశంకర్ రెడ్డి (CI Ravishankar Reddy) ఏకవచనంతో మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎమ్మెల్యే వల్లే గొడవ జరిగిందని అక్రమంగా కేసు నమోదు చేశారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 2.45 గంటలకు పోలీసులు చిప్పగిరిలోని విరూపాక్షి నివాసానికి చేరుకుని, ఆయనను, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటి తలుపులు బలవంతంగా తెరిచి అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించగా, ఈ ఘటనపై కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు దారుణం
— YSR Congress Party (@YSRCParty) August 2, 2026
అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టి అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం
టీడీపీ నేతల దాడిపై చర్యలేవీ?.. బాధితులపైనే పోలీసుల ప్రతాపమా?
ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడిని వెంటనే విడుదల చేయాలి
: వైఎస్సార్సీపీ నేతల డిమాండ్… pic.twitter.com/M02YhLIus8








