ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమైన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రుల పర్ఫామెన్స్ రిపోర్టులపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే విధంగా విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుల అంశాన్ని ఈ భేటీలో కీలకంగా సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని మెట్రో కనెక్టివిటీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ అమోదం తెలపనుంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ. 80 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జిందాల్ సంస్థతో కీలక చర్చ
మధ్యాహ్నం సీఎం జిందాల్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది. చెత్త నుంచి ఇంధనాన్ని సృష్టించే ఆధునిక ప్లాంట్ల ఏర్పాటుపై ఈ చర్చలో ప్రాధాన్యతనివ్వనున్నారు. ఈ ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సాధనంలో ఆంధ్రప్రదేశ్ను ముందుకు నడిపించగలవని ప్రభుత్వ వర్గాలు విశ్వసిస్తున్నాయి.