ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చెందిన జన్వాడ కోడి చెరువు భూముల వివాదంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్కు సంబంధించిన భూమి FTL పరిధిలో ఉందన్న మాట వాస్తవమేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రంగారెడ్డి జిల్లా జన్వాడ కోడి చెరువు పరిధిలో ఉన్న పవన్ కళ్యాణ్ భూమిలో దాదాపు 6 నుండి 7 ఎకరాలు FTL పరిధిలోకి వస్తాయని, మిగతా 3 నుండి 4 ఎకరాలు మాత్రమే FTL బయట ఉన్నాయని రంగనాథ్ తెలిపారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఫెన్స్ వేయకూడదని, అక్కడ పవన్ కళ్యాణ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఆయన చేసిన పొరపాటన్నారు.
గత కొంతకాలంగా జన్వాడలోని కోడి చెరువు పరిధిలో పవన్ కళ్యాణ్ భూములపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను చెరువును ఆక్రమించలేదని, ఒకవేళ ఆక్రమించినట్లు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తానని గతంలో పవన్ కళ్యాణ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
అయితే, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఆ భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మాట వాస్తవమేనని, అక్కడ ఫెన్సింగ్ వేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అదే సమయంలో చెరువును ఆక్రమించడం, మట్టి నింపడం లేదా నీటి ప్రవాహాన్ని అడ్డుకునే నిర్మాణాలు చేపట్టినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. చెరువులో కంచె వేయడం మాత్రమే నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.
హైడ్రా కమిషనర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ నిర్ణయంపైనే నెలకొంది.
గతంలో ప్రకటించిన విధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తారా?
లేదా అనుమతులు లేకుండా తన భూమిలోకి ప్రవేశించారంటూ గత ప్రెస్ మీట్లో హెచ్చరించిన విధంగా కేసులు నమోదు దిశగా వెళ్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.








