ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS)ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఘాటుగా స్పందించారు. సీఎం స్వయంగా సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీటిని (Water) పరిశీలించాలని సవాల్ విసిరారు. “రంగనాయక సాగర్లోకి వస్తున్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు చెప్పాలి. కాళేశ్వరం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పడం వాస్తవాలకు విరుద్ధం” అని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ (Telangana) వ్యవసాయ రంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కీలకంగా మారిందని, దీనివల్లే అనేక ప్రాంతాల్లో సాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు.
రంగనాయక సాగర్ నీటితోనే సిద్దిపేట పరిధిలో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి సాధించామని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే సీఎం(CM) రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.









