ప్రభుత్వ ఆస్ప‌త్రిపై కంప్ల‌యింట్‌.. సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ

ప్రభుత్వ ఆస్ప‌త్రిపై కంప్ల‌యింట్‌.. సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ

Summarize with AI

ప్రజా వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. జూలై 8న చెన్నైలోని అయనావరం ప్రభుత్వ తల్లి-శిశు సంక్షేమ ఆస్ప‌త్రిని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా సందర్శించిన ఆయన, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు, తల్లులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, ఆహారం, ఇతర సౌకర్యాలపై వివరాలు తెలుసుకుంటూ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని స్వయంగా ఆరా తీశారు. సీఎం ఆకస్మికంగా ఆస్ప‌త్రికి రావడంతో వైద్య సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

ఆస్ప‌త్రిలోని వివిధ వార్డులను పరిశీలించిన సీఎం విజయ్.. వైద్యులు, నర్సులు, అధికారులతో సమావేశమై రోగులకు అందుతున్న చికిత్సపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. తల్లి-శిశు సంక్షేమ సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఆస్ప‌త్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించిన ఆయన, ప్రతి తల్లి, ప్రతి శిశువుకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ ప్రస్తుతం తమిళనాడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment