భారత టీ20 జట్టు (India T20 Team) మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ ప్రకటనలపై (Fake Statements) ఘాటుగా స్పందించారు. 2026 టీ20 ప్రపంచకప్ను భారత్(India) గెలిపించిన కెప్టెన్గా నిలిచిన సూర్య, ప్రస్తుతం జట్టులో లేకపోయినా భారత క్రికెట్పై తన నిబద్ధత ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. తన పేరుతో ప్రచారం చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, తాను అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదని ‘ఎక్స్’ (X)(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ధృవీకరించని పోస్టులను నమ్మవద్దని, వాటిని షేర్ చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోందని, ఆటగాళ్లందరికీ తన పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుందని సూర్య పేర్కొన్నారు.
ఇటీవల కొన్ని ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలు, ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా తనను జట్టులోకి తీసుకోలేదని, సెలక్టర్లు తనకు అన్యాయం చేశారంటూ సూర్య వ్యాఖ్యానించినట్లు ఒక నకిలీ స్టేట్మెంట్ను వైరల్ చేశాయి. “ప్రపంచకప్ (World Cup) తర్వాత కూడా కెప్టెన్గా కొనసాగిస్తామని చెప్పారు.. కానీ చివరి నిమిషంలో జట్టులో చోటు లేదని తెలిసింది” అంటూ ప్రచారం చేసిన ఆ వ్యాఖ్యలను సూర్యకుమార్ పూర్తిగా ఖండించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని, అధికారిక సమాచారం వచ్చినప్పుడే నమ్మాలని అభిమానులకు సూచించారు. తన వ్యక్తిగత పరిస్థితులు ఎలా ఉన్నా, భారత క్రికెట్ విజయాలకే ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తానని మరోసారి స్పష్టం చేశారు.








