సాయికృష్ణ కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. టెర్రస్‌పై ఎముకలు, బూడిద

సాయికృష్ణ కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. టెర్రస్‌పై ఎముకలు, బూడిద

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీని కోరుతూ సిట్‌ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ మెమోలో పేర్కొన్న అంశాలు పౌర స‌మాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. స్టేషన్‌లో సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితులు ఏ స్థాయికి తెగించారో సిట్ పక్కా ఆధారాలతో కోర్టు ముందుంచింది.

సాక్ష్యాలను నాశనం చేసే క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపలే దారుణమైన చర్యలకు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సాయికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మరకలను సిట్ బృందం గుర్తించింది.

పోలీస్ స్టేషన్ బిల్డింగ్ టెర్రస్ నుంచి సిట్ అధికారులు అత్యంత కీలకమైన సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మరకలు ఉన్న ఒక లాఠీ, కొన్ని ఎముకల ముక్కలు, కాలిపోయిన బూడిద, అలాగే పాక్షికంగా కాలిన స్థితిలో ఉన్న ఇనుప హ్యాండ్ గొలుసు (హ్యాండ్ కఫ్స్ లేదా చైన్) లభించడం సంచలనంగా మారింది.

సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకువచ్చినప్పటి నుంచి జరిగిన దారుణాలను దాచేందుకు డిజిటల్ సాక్ష్యాలను పూర్తిగా తుడిచిపెట్టేశారు. కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్ లభించకుండా డిలీట్ చేశారు. ఈ ఫుటేజ్ ఉద్దేశపూర్వకంగా ధ్వంసం అయినట్లు ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) సైంటిఫిక్ బృందం కూడా ప్రాథమికంగా నిర్ధారించింది. సాయికృష్ణ మరణించే సమయంలో స్టేషన్ లోపల ఉన్న కొందరు సిబ్బంది ఇచ్చిన కీలక స్టేట్మెంట్ల ఆధారంగా ఈ విషయాన్ని సిట్ అధికారులు గుర్తించారు.

సాయికృష్ణ లాకప్‌లోనే చనిపోయాడని తేలినప్పటికీ.. అతడి మృతదేహాన్ని ఆ తర్వాత ఎక్కడకు తరలించారు? ఎక్కడ దహనం చేశారు? అనే విషయాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. “సీఐ నాగరాజును కస్టడీకి అనుమతిస్తే.. ఆయనను నేరుగా ఘటనా స్థలాలకు తీసుకువెళ్లి మృతదేహాన్ని మాయం చేసిన విధానాన్ని, ఆ ప్రాంతాన్ని గుర్తిస్తాం” అని సిట్ తన మెమోలో న్యాయస్థానానికి వివరించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment