రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాయికృష్ణను పోలీసులు లాకప్డెత్ చేశారనే ఆరోపణలు నిజమేననే అనుమానాలకు బలం చేకూరుస్తూ.. ఏకంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించిన కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది. కేసులో అత్యంత ప్రధానమైన ఆధారాలు మాయం కావడం బెజవాడ పోలీస్ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది.
సీఐ నాగరాజు పనేనా?
ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారుల తనిఖీల్లో ఈ షాకింగ్ నిజం బయటపడింది. గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ను మాయం అయినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు (నెల రోజుల పాటు) జరిగిన పోలీస్ స్టేషన్ పరిణామాల సీసీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఆ నెల రోజుల్లో కేవలం రెండు రోజులకు సంబంధించిన ఫుటేజ్ మాత్రమే ఉంచి, మిగతా 28 రోజుల డేటాను మాయం చేసినట్లు తేలడంతో ‘సిట్’ అధికారులు సైతం షాక్కు గురయ్యారు.
గాదె సాయికృష్ణ అదృశ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఇటీవల కోర్టు కృష్ణలంక పీఎస్కు సంబంధించిన నెల రోజుల సీసీ ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశించింది. అయితే, కోర్టు నుంచి ఈ ఆదేశాలు రాకముందే, పీఎస్ లోపల తాము చేసిన ‘థర్డ్ డిగ్రీ’ పాపాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో సీఐ నాగరాజు ఆ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేసేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాయికృష్ణను సీఐ నాగరాజు పీఎస్లోనే లాకప్డెత్ చేశారని బాధిత కుటుంబం మొదటి నుంచి ఆరోపిస్తోంది. తాజాగా పీఎస్ లోపల నెల రోజుల పాటు ఏం జరిగిందో చూపించే సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా మాయం కావడంతో.. సాయికృష్ణకు థర్డ్ డిగ్రీ ఇచ్చి చంపేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. అందుకే ఆధారాలు దొరకకుండా ఫుటేజ్ గయబ్ చేశారని చర్చ నడుస్తోంది.
పీఎస్ కెమెరా ఏమైంది హోంమంత్రి గారూ?
రాష్ట్రంలో 70 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, సాంకేతికతతో నేరాలను పూర్తిగా నియంత్రించేశామని చెప్పతున్న హోంమంత్రిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. “ఏకంగా పోలీస్ స్టేషన్ లోపల ఉన్న కెమెరా ఫుటేజ్ మాయమైపోతుంటే ఏం సమాధానం చెప్తారు? ఏకంగా పోలీసులే సాక్ష్యాలను తుడిచివేస్తుంటే.. మీ ‘రెడ్ బుక్’ రూలింగ్ ఎటు పోయింది?” అని ప్రశ్నిస్తున్నారు.








