యూట్యూబర్ దంపతులకు లుకౌట్ నోటీసులు!

ప్రముఖ యూట్యూబర్ నంద‌న కుటుంబంపై కేసు

యూట్యూబ్ ద్వారా వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న రమానందన–మధుకర్ (నందూస్ వరల్డ్) దంపతులు ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారారు. విదేశీ ఉద్యోగాలు, వీసా సేవల పేరుతో నిర్వహించిన ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ కార్యకలాపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.

తాజాగా ఈ దంపతులకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు వీసా రెన్యువల్, ఉద్యోగ అవకాశాల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో మధుకర్, రమానందనతో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పలువురు బాధితులు తమను మోసం చేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు రమానందన మాత్రం తమపై జరుగుతున్నది దుష్ప్రచారమేనని, తమ పేర్లతో ఎలాంటి కంపెనీలు లేవని చెబుతున్నారు. వ్యక్తిగత కక్షతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు.

అయితే బాధితుల ఆరోపణలు, పోలీసుల విచారణ, కోర్టు ప్రక్రియల నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండటంతో తుది నిజాలు అధికారిక దర్యాప్తు పూర్తయ్యాకే వెలుగులోకి రానున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment