టీడీపీ ఎంపీ ‘యాసిడ్ దాడి’..! – కేశినేని నాని సంచలన ట్వీట్లు

టీడీపీ ఎంపీ 'యాసిడ్ దాడి'..! - కేశినేని నాని సంచలన ట్వీట్లు

విజయవాడ రాజకీయాల్లో మరోసారి అల‌జ‌డి మొద‌లైంది. మాజీ ఎంపీ కేశినేని నాని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనపై, తన స్నేహితులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయంటూ నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు చేశారు.

క్రిమినల్ కేసులు.. పోలీసుల వేధింపులు
కేశినేని నాని తన ట్వీట్‌లో స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “నేను రాజకీయాలకు దూరంగా ఉండి రెండేళ్లు అవుతున్నా ఇంకా నాపై కక్ష సాధింపులు ఆపలేదు. రాజకీయాలతో అస్సలు సంబంధం లేని నా చిన్ననాటి స్నేహితుడు తాతినేని రాంబాబును స్థానిక‌ ఎంపీ (టీడీపీ ఎంపీ చిన్ని) పోలీసులతో వేధిస్తున్నారు. అతనిపై అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు” అని నాని పేర్కొన్నారు.

అంతేకాకుండా, టాస్క్‌ఫోర్స్ పీఎస్ఐ నవీన్ అనే అధికారి రాంబాబు ఇంట్లో లేని సమయంలో వెళ్ళి, ఆయన వృద్ధ తల్లిని తీవ్రంగా వేధించారని నాని ఆరోపించారు. ఈ వేధింపుల వల్ల ఆ కుటుంబం తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోందని, వెంటనే సీఎం చంద్రబాబు ఇందులో జోక్యం చేసుకుని పోలీసు యంత్రాంగం దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

‘యాసిడ్’ పోశారంటూ సంచలన పోస్ట్!
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టార్గెట్ చేస్తూ కేశినేని నాని మరో బాంబు పేల్చారు. ఈ పోస్టులో ఆయన చేసిన ఆరోపణలు విజయవాడ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

కేశినేని చిన్ని అక్రమార్జన ద్వారా సంపాదించిన సొమ్ములో సుమారు 27 కోట్ల రూపాయల బ్లాక్ మనీ దొంగతనం జరిగింది. ఈ దొంగతనం వ్యవహారంతో సంబంధం ఉన్న ఆయన పీఏలు, కార్యాలయ సిబ్బంది అయిన మోహన్, పొన్నం రాజేష్, రామచంద్ర, అంజి, హైదరాబాద్‌కు చెందిన నాగ శ్రీనివాసులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆ దొంగతనం జరిగిన సొమ్మును రికవరీ చేసే క్రమంలో పరారీలో ఉన్న ఓ వ్యక్తిని పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలోనే సదరు వ్యక్తి చేతులపై యాసిడ్ పోసి దారుణంగా హింసించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయని కేశినేని నాని ట్వీట్ చేశారు.

మాజీ ఎంపీ కేశినేని నాని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ఈ విషయాలను ట్యాగ్ చేయడంతో ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. అయితే, కేశినేని చిన్ని కార్యాలయంలో రూ.27 కోట్ల దొంగతనం జరగడంపై కానీ, ఒక వ్యక్తిపై యాసిడ్ పోశారనే అంశంపై కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా ఆధారాలు వెలుగులోకి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని లేదా పోలీస్ శాఖ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment