మంట లేకుండానే ‘బాబు’ వంట.. ఓ రేంజ్ ట్రోలింగ్!

మంట లేకుండానే ‘విజనరీ’ వంట.. ఓ రేంజ్ ట్రోలింగ్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఒక అధికారిక కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో జరిగిన “మత్స్యకారుల సేవలో” కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. స్థానిక మత్స్యకార కుటుంబంతో కలిసి ముచ్చటించారు. అయితే, ఈ సందర్భంగా విడుదలైన ఒక వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారడమే కాకుండా, నెటిజన్లకు మంచి స్ట‌ఫ్ అయ్యింది.

మత్స్యకారులతో కలిసిపోతున్నట్టు చూపించే క్రమంలో తెలుగుదేశం పార్టీ (TDP) సోషల్ మీడియా విభాగం ఒక వీడియోను చిత్రీకరించి విడుదల చేసింది. చంద్రబాబు స్వయంగా మార్కెట్‌లో చేపలు కొనుగోలు చేసి, ఆ తర్వాత ఒక మత్స్యకార కుటుంబం ఇంట్లోకి వెళ్లి గ్యాస్ పొయ్యి మీద గరిటె తిప్పుతూ వంట చేస్తున్నట్టు ఆ వీడియోలో చూపించారు.

అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డింది. చంద్ర‌బాబు గరిటె తిప్పుతున్న ఆ గ్యాస్ స్టవ్ అస్సలు వెలగనే లేదు! కనీసం మంట (Flame) లేకుండానే బాండీలో చేపల ఫ్రై, చేపల పులుసు ఉడికిపోతున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ ‘మంట లేని వంట’ వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

‘హైటెక్ మిరాకిల్’ అంటూ కౌంటర్లు
ఈ వీడియో బయటకు రావడం ఆలస్యం.. నెటిజన్లు, ప్రతిపక్షాల మద్దతుదారులు చంద్రబాబుపై ట్రోలింగ్‌తో విరుచుకుపడుతున్నారు. “గ్యాస్ వాడకాన్ని, ఐటీని నేనే ప్రజలకు పరిచయం చేశానని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు పొయ్యి వెలిగించకుండానే వంట చేసే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు” అంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. “ఇది విజనరీ చంద్రబాబుకే సాధ్యమైన అద్భుతం.. మిరాకిల్!” అంటూ హోరెత్తిస్తున్నారు.

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా కేవలం పబ్లిసిటీ పిచ్చితో నాలుగు కెమెరాలు, కాలర్ మైకులను వెంటబెట్టుకొని వెళ్తుంటారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. “ముందుగా పోలీసులు, సెక్యూరిటీ గార్డులు వచ్చి ఆ గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేస్తారు. ఆ తర్వాత చంద్రబాబుతో ఏ పేదవాడు మాట్లాడాలి? ఏ స్క్రిప్ట్ చదవాలి? ఏం చెప్పాలి? అనేది టీడీపీ సోషల్ మీడియా కోర్ టీమ్ ముందే డిసైడ్ చేస్తుంది. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగే సినిమా షూటింగ్ లాంటిదేనని ఈ మంట లేని వంటతో తేలిపోయింది.” అని చెబుతున్నారు.

గతంలో కూడా ఇలాగే కాఫీలు పెట్టడం, పేదల ఇళ్లలో భోజనాలు చేయడం వంటి వీడియోలు వచ్చాయని.. చంద్ర‌బాబు కార్య‌క్ర‌మాల‌ను గ‌మ‌నించే వారికి ఎవరికైనా ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం తీసే షూటింగ్ అని అర్థమైపోతుందని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ ‘మంట లేని చేపల వంట’ వీడియో పెద్ద దుమారమే రేపుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment