అమరావతి(Amaravati), పర్యావరణ పరిరక్షణపై (Environmental Regulations) జనసేన మాజీ నేత, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ (Bolishetty Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, ఇది తీవ్ర పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన మాజీ నేత కూటమి ప్రభుత్వ (Alliance Government) తీరుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రాజధాని నిర్మాణం కోసం ప్రకృతిని పణంగా పెట్టకూడదని బొలిశెట్టి స్పష్టం చేశారు. “అమరావతి పరిధిలో 84 శాతం భూములు సాగుకు యోగ్యమైనవి, పర్యావరణ పరంగా కీలకమైనవి. ఇక్కడ చేపట్టే ఏ నిర్మాణమైనా నిబంధనలకు లోబడి ఉండాలి” అని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలోని నదులు, వాగులు, కాలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు.
కూటమి నేతలను వదిలిపెట్టను..
ఇన్నాళ్లూ జనసేనలో ఉన్న బొలిశెట్టి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నారు. అవినీతి, పర్యావరణ విధ్వంసంపై తన పోరాటం కొనసాగుతుందని, తప్పు చేస్తే కూటమి నేతలను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గతంలో కొల్లేరు విషయంలోనూ పవన్ కళ్యాణ్ తీరును బొల్లిశెట్టి తప్పుబట్టారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ వ్యవస్థ కంటే మీడియాపైనే ప్రజలకు నమ్మకం ఉందని, ఈ సమాజాన్ని, పర్యావరణాన్ని కాపాడడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ వనరుల లూటీని అడ్డుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ఏకం కావాలని కోరారు. బొలిశెట్టి సత్యనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా పర్యావరణ ప్రేమికుల్లో పెను దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.








జనసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. వైసీపీ ఎమ్మెల్సీ సవాల్