వెస్ట్ బెంగాల్లో (West Bengal) జరుగుతున్న తొలి దశ శాసనసభ ఎన్నికలు (Assembly Elections) తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో పోలింగ్ (Polling) ప్రారంభమైన కొద్దిసేపటికే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముర్షిదాబాద్ (Murshidabad), కూచ్ బెహార్ (Cooch Behar), సిలిగురి (Siliguri), మాల్దా (Malda) జిల్లాల్లో దహనకాండ, రాళ్లదాడులు, వాగ్వాదాలు వంటి ఘటనలు నమోదయ్యాయి. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సమయంలోనే పలుచోట్ల ఘర్షణలు చెలరేగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
ముర్షిదాబాద్లో ఒక అభ్యర్థి కాన్వాయ్పై దాడి జరగడం, అలాగే స్థానిక రాజకీయ కార్యకర్తల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. కూచ్ బెహార్ ప్రాంతంలో గుంపు గుమిగూడడంతో పరిస్థితి అదుపు తప్పి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. దక్షిణ దినాజ్పూర్లోనూ బీజేపీ(BJP) అభ్యర్థిపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు మాల్దాలో ఈవీఎం సమస్యలు, ఎన్నికల అధికారిని ఓటర్లు చుట్టుముట్టిన ఘటనలు కూడా కలకలం రేపాయి.
సిలిగురి సహా పలు ప్రాంతాల్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు ఘర్షణలకు దారితీయడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల చిన్నపాటి పేలుళ్లు, విధ్వంస ఘటనలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం మరియు భద్రతా బలగాలు అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు ప్రధాన చర్చగా మారాయి.







