తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family) చుట్టూ చర్చలు రగులుతున్న వేళ, కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో భారీ దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త పార్టీ స్థాపనపై (New Party Formation) ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో, మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్(KTR) పరోక్షంగా గట్టి సందేశం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావొచ్చని కానీ ప్రజల విశ్వాసమే అసలు పరీక్ష అని ఆయన ఎద్దేవా చేశారు. వ్యక్తిగత బాధలను ప్రజల సమస్యలుగా చూపిస్తే జనం నమ్మరని వ్యాఖ్యానించిన ఆయన, “పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ, వారిని బాధ పెట్టకూడదు” అన్న మాటలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి.
ఇదిలా ఉంటే, రాబోయే ఎన్నికలపై స్పష్టమైన వ్యూహాన్ని ప్రకటించిన కేటీఆర్, భవిష్యత్తులో బీఆర్ఎస్(BRS) ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోదని తేల్చి చెప్పారు. పార్టీ తిరిగి పుంజుకుంటుందన్న నమ్మకంతో 2027 నుంచి పాదయాత్ర (Padayatra) ప్రారంభిస్తానని వెల్లడించారు. పార్టీ పేరు మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలన్న డిమాండ్పై స్పందిస్తూ, తుది నిర్ణయం మాత్రం కేసీఆర్(KCR) చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పిన ఆయన, పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో భూముల ధరలు పడిపోవడం, ఆర్థిక పరిస్థితులపై విమర్శలు చేస్తూ, ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలన వైపే చూస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








