బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. త్వరలోనే బిహార్కు కొత్త ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఈనెల 14న సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అనంతరం 15న కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ కీలక నాయకులతో జరిగే సమావేశంలో సామ్రాట్ చౌదరి పేరును అధికారికంగా ఖరారు చేయనున్నారు. బిహార్ చరిత్రలో తొలిసారి బీజేపీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
1990 నుంచి రాజకీయ ప్రయాణం
సామ్రాట్ చౌదరి 1990లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పర్బత్తా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. 2010లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వహించారు.
2014లో పార్టీ మార్పుతో జనతా దళ్ యూలో చేరి పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2018లో బీజేపీలో చేరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. 2024 జనవరి 28న నితీశ్ కుమార్ మంత్రివర్గంలో మంత్రి పదవిని స్వీకరించిన ఆయన, అనంతరం బిహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇప్పుడు 2026లో సీఎం పదవికి ఎదగడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది.








