ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంటే ఉక్రెయిన్ దేశం బాంబుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. రష్యా తాజాగా ఉక్రెయిన్పై మరొకసారి దాడి చేసింది. రష్యా 70కి పైగా బాలిస్టిక్ క్షిపణులు మరియు 100కి పైగా డ్రోన్లను ఉపయోగించి బుధవారం ఉక్రెయిన్ విద్యుత్ వనరులపై దాడి చేసింది. ఖార్కీవ్ నగరంలోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడి జరిపినట్లు ఉక్రెయిన్ ఇంధన మంత్రి హెర్మన్ హలుష్చెంకో ప్రకటన చేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడి స్పందన..
రష్యా దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించారు. “ఇది పుతిన్ ప్రణాళిక ప్రకారం చేసిన దాడి” అని ఆయన అన్నారు. క్రిస్మస్ రోజు రష్యా ఉద్దేశపూర్వకంగా ఈ దాడిని నిర్వహించిందని ఆయన వెల్లడించారు. ఈ దాడిని “అమానవీయమైనది” అంటూ జెలెన్ స్కీ పేర్కొన్నారు. 50కి పైగా రష్యా క్షిపణులను ఉక్రెయిన్ వైమానిక దళం కూల్చివేసింది. ఈ దాడులు ఉక్రెయిన్కు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. ప్రస్తుతం, దేశంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ లైన్ తెగిపోయి అంధకారమైంది.