డ్రగ్స్ తీసుకున్నా, మహిళలను వేధించినా ‘నో యాక్షన్’.. – బాబు తీరుపై జ‌గ‌న్ ఫైర్‌

డ్రగ్స్ తీసుకున్నా, మహిళలను వేధించినా ‘నో యాక్షన్’.. - బాబు తీరుపై జ‌గ‌న్ ఫైర్‌

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అధికార కూటమి నాయకుల (Ruling Alliance) ప్రవర్తన, వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి నేతలు తప్పుల మీద తప్పులు చేస్తున్నా, కనీసం ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు ‘నైజం’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. తాడేప‌ల్లిలోని (Tadepalli) వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఒంగోలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రాసలీలలు.. డ్రగ్స్.. అయినా చర్యలేవి?
పార్లమెంటు చరిత్రలోనే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఏకైక ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ నిలిచారని, ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జగన్ విమర్శించారు. కేవలం ఎంపీ మాత్రమే కాదు, వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏల ఆగడాలను వివ‌రిస్తూ వారిపై చంద్ర‌బాబు ఏం యాక్ష‌న్ తీసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) త‌న‌పై అత్యాచారం చేసి, మోసం చేశార‌ని బాధితురాలు నేరుగా ఫిర్యాదు చేసినా చర్యలు లేవు.

టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ (Koona Ravi Kumar) కేజీబీవీ ప్రిన్సిపల్‌ను వేధించినా చంద్ర‌బాబు (Chandrababu) మౌనంగానే ఉన్నారు. ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, నసీర్ లైంగిక దాడులు, అశ్లీల వీడియో కాల్స్ ఆరోపణలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీటీడీ ఛైర్మన్ వీడియో ఆధారాలతో సహా దొరికిపోయినా చంద్రబాబుకు పట్టడం లేదు. చంద్ర‌బాబు సొంత బావ‌మ‌ర్ది బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినా మందలించాల్సింది పోయి, నవ్వుకుంటూ చంద్ర‌బాబు సమర్థించాడ‌ని జగన్ ధ్వ‌జ‌మెత్తాడు. చంద్ర‌బాబు వైఖ‌రి వ‌ల్లే రాష్ట్రంలో ఆడ‌వారిపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయ‌న్నారు.

పేదల పథకాలకు ‘చరమగీతం’..
కూట‌మి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అమలైన కీలక పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని ఆయన విమర్శించారు. వైద్యం, విద్య గాలికి వ‌దిలేశార‌న్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 6 వేల కోట్లు దాటాయని, విద్యా దీవెన, వసతి దీవెన నిలిచిపోయాయని మండిపడ్డారు. పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా లేక రైతులు విలవిల్లాడుతున్నారని అన్నారు. సున్నా వడ్డీ, చేయూత, ఆసరా వంటి పథకాలను చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తుంటే, ఇప్పుడు ఆ ఊసే లేదని ధ్వజమెత్తారు.

జగన్ 2.O.. కార్యకర్తలే సైన్యం!
వచ్చే ఏడాదిన్నర కాలంలో తాను మళ్లీ ప్రజల్లోకి వస్తానని, భారీ పాదయాత్ర చేపడతానని జగన్ ప్రకటించారు. “ఈ ప్రభుత్వానికి ఉన్నది ఇంకా రెండు బడ్జెట్లు మాత్రమే. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. రాబోయే ‘జగన్ 2.O’ ప్రభుత్వంలో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి పథకం కార్యకర్తల ద్వారానే అమలు చేస్తాం.” అని ఆయన శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కేవలం ‘దోచుకో.. తినుకో.. పంచుకో’ అన్నట్లుగా కూటమి పాలన సాగుతోందని, దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని జగన్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment