అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన పాలకవర్గంలో భారత సంతతికి చెందిన అమెరికన్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన పలువురు ప్రతిభావంతులకి కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్, తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రముఖంగా ఉన్న శ్రీరామ్ కృష్ణన్ను తన కార్యవర్గంలో చేర్చారు.
శ్రీరామ్ కృష్ణన్ను వైట్హౌస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఆఫీస్లో సీనియర్ పాలసీ అడ్వైజర్గా నియమించారు. కృత్రిమ మేధపై అమెరికా నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఆయన క్రిప్టో జార్ డేవిడ్ సాక్స్తో కలిసి పనిచేయనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. శ్రీరామ్ వంటి అనుభవజ్ఞుల సహాయంతో కృత్రిమ మేధపై అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహించగలదని అభిప్రాయపడ్డారు.
చెన్నై నుంచి శ్వేతసౌధం వరకు
తమిళనాడులోని చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ తన ఇంజినీరింగ్ విద్యను అన్నా యూనివర్సిటీలో పూర్తి చేశారు. 2007లో మైక్రోసాఫ్ట్లో ప్రోగ్రామ్ మేనేజర్గా కెరీర్ను ప్రారంభించిన శ్రీరామ్, ఆ తర్వాత ఫేస్బుక్, యాహూ, ట్విట్టర్ (ఎక్స్), స్నాప్ లాంటి ప్రముఖ టెక్ సంస్థల్లో కీలక పాత్రలు నిర్వహించారు. 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన సమయంలో కూడా శ్రీరామ్ అక్కడే ఉన్నారు.
అమెరికా ప్రభుత్వంలో శ్రీరామ్ కృష్ణన్కు ఈ గుర్తింపు తమ దేశ ప్రతిభకు గౌరవంగా భావించవచ్చు. ఆయన కృషి, విజయం ఇండో-అమెరికన్ కమ్యూనిటీకి గర్వకారణంగా నిలుస్తోంది.