కలెక్టర్ మూడు రోజుల పాటు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధం అని స్పష్టంగా ప్రకటించినా, కోటప్పకొండ పరిసరాల్లో మాత్రం పూర్తిగా భిన్న దృశ్యం కనిపించింది. ఉత్సవాలకు భారీగా వచ్చిన భక్తుల మధ్యే బహిరంగంగా మద్యం అమ్మకాలు జరగడం కలకలం రేపింది. ఆశ్చర్యకరంగా, ఈ విక్రయాలు నిర్వహించింది ఒక పోలీస్ హోంగార్డు అని బయటపడటం మరింత వివాదానికి దారి తీసింది.
ఉత్సవాల్లో బహిరంగంగా విక్రయాలు
కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం వద్ద టెంట్ వేసి మద్యం బాటిళ్లను అధిక ధరలకు విక్రయించినట్లు భక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. నిషేధం అమల్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పూజలు చేసేందుకు వచ్చిన పవిత్ర స్థలంలో ఇలా జరగడం భావోద్వేగాలను దెబ్బతీసింది” అని వారు మండిపడుతున్నారు.
ఈ వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. హోంగార్డు విధుల్లో ఉన్నాడా, లేక సస్పెండ్ అయ్యాడా అనే అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.








