లడ్డూ విషయంపై ఎవ్వరూ మాట్లాడడం లేదని ఇటీవల జనసేన మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ అలిగి ఆగ్రహంతో వెళ్లిపోయిన తరువాత ఎమ్మెల్సీ నాగబాబు చాలా నెలల తరువాత ఓ వీడియో విడుదల చేశారు. వైఎస్ జగన్ను హిందూ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నంగా.. అది బూమ్రాంగ్ అయ్యింది. నాగబాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
అయితే నాగబాబు ఆశించిన మద్దతుకు భిన్నంగా, నెటిజన్ల తీవ్రంగా స్పందించడం గమనార్హం. ముఖ్యంగా ఫేస్బుక్లో వీడియోకు వచ్చిన కామెంట్లు నాగబాబు తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ను సంతృప్తిపరచేందుకే ఈ వీడియో చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు గోడల మధ్య పవన్ కల్యాణ్ నాగబాబుతో ఏం మాట్లాడారో తెలియదని, కానీ ఆ ఒత్తిడితోనే జగన్తో పాటు వైసీపీ నేతలందరినీ టార్గెట్ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
గతంలో తానొక నాస్తికుడిని అని, దేవుడు అనేది మనం సృష్టించుకున్న ఒక అపోహ అని, తాను గుడికి వెళ్లనని పలు సందర్భాల్లో మీడియాకు చెప్పిన వీడియోలను తవ్వితీసి మరీ ప్రశ్నిస్తున్నారు. నాస్తికుడు సడన్గా సనాతని ఎలా అయ్యాడని సెటైర్లు వేస్తున్నారు.
నాస్తికుడు సనాతని హిందూ అయ్యాడు pic.twitter.com/yJhdhytkCm
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) February 5, 2026
నెటిజన్ల విమర్శలు ఇలా…
“మీ తమ్ముడికి, మీకు హిందూ దేవుళ్లతో, హిందువుల మనోభావాలతో ఆడుకోవడం అలవాటైంది. దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రజలకు అన్నీ తెలుసు”
“ఎర్రశాలువా కప్పుకుని రవీంద్రనాథ్ ఠాగూర్లా ప్రసంగాలు ఇవ్వకు. చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకల్లో పవన్ గురించి ఏమన్నావో , చేతిలో చిడతలు పట్టుకుని లోకేశ్ని, ఏబీఎన్ రాధాకృష్ణని ఏమన్నావో అందరూ చూశారు. బాలయ్యబాబు ఎవరో తెలియదని మీరన్న సంగతి బాగా తెలుసు. ప్రస్తుతానికి వాటిని ఉద్ధరించు. తర్వాత హిందువుల్ని ఉద్ధరించుదువులే”
“ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని …నువ్వు కూడా నీతులు చెబుతున్నావ్ చూడు…మా ఖర్మరా బాబు. రోజుకో మాట, పూటకో మాట చెప్పే మీరు రాజకీయాల్లోకి వచ్చి చెడగొడుతున్నారు”
“నీ కన్నా, నీ తమ్ముడి కన్నా దేశ ద్రోహులెవరూ లేరు. మీ జీవిత పబ్బాలు గడుపుకోడానికి కులాన్ని , మతాన్ని వాడుకున్నారు. బీజేపీతో విభేదించినప్పుడు… ఇదే తిరుపతి లడ్డూను నరేంద్ర మోదీ పాచిపోయినవి ఇచ్చాడని పవన్ అన్నారు. మరిచిపోయావా”
“ఇప్పటికే కూటమి పరువు పోయింది…మౌనంగా కూచోండయ్యా”
“అంతర్వేదిలో రథం దగ్ధమైతే సీబీఐకి వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఏం చేస్తోంది. ఆరేళ్లుగా పట్టించుకోలేదంటున్నావ్, ఇప్పుడు రెండేళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. విచారణ చేయించి, దోషులెవరో తేల్చొచ్చు కదా”
“దీపం వద్ద తండ్రి సిగరెట్ వెలిగించాడని పవన్ చెప్పారు. హిందుత్వం గురించి మీరే చెప్పాలి” “మీ వీడియోపై వస్తున్న స్పందన చూసిన తర్వాతైనా, ఇలాంటివి చేయడం మానండి”
నాగబాబు విడుదల చేసిన వీడియోపై సపోర్టు కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువ. ఇప్పటికే కూటమి పరువు పోయిందని, కనీసం ఇకైనా మౌనంగా ఉండాలని కొందరు సలహా ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ తిట్టాడనే కారణంతో జగన్ను లక్ష్యంగా చేసుకుని నాగబాబు ఈ వీడియో చేశారన్న భావన నెటిజన్లలో బలంగా వ్యక్తమవుతోంది. అయితే రాజకీయాల్లో అంతిమంగా ప్రజాభిప్రాయమే భవిష్యత్తును నిర్ణయిస్తుందని, తన వీడియో కింద వస్తున్న కామెంట్లను నాగబాబు ఒక్కసారి గమనిస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు.








