మతపరమైన వ్యాఖ్యలతో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి రాజకీయ దుమారం రేపారు. గతేడాది సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈసారి చెన్నైలో జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో తనను తాను “గర్వించదగిన క్రైస్తవుడు”గా ప్రకటించుకున్నారు. తనకు అన్ని మతాలూ సమానమేనని, అన్ని మతాలు ప్రేమను చూపించడమే నేర్పుతాయని చెప్పారు.
మత సామరస్యంపై ఉదయనిధి వ్యాఖ్యలు
క్రిస్మస్ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. గతేడాది క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్పాను, కానీ, అది కొంతమందికి చిరాకు తెప్పించింది. మళ్లీ ఈరోజు చెబుతున్నాను.. నేను గర్వించదగ్గ క్రిస్టియన్ని అని అన్నారు. తనకు అన్ని మతాలు సమానమని పేర్కొంటూ, మత సామరస్యానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
కాగా, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట రాజకీయ రంగు పులుముకున్నాయి. గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడి అనేక కేసులు, బెదిరింపులు ఎదుర్కొన్నారు. మరిప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.