టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ (New Year Celebrations) కోసం వేర్వేరుగా ఇటలీ (Italy) వెళ్లిన ఈ జంట.. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మళ్లీ దొరికిపోయారు. విజయ్ పోస్టు చేసిన ఓ ఫొటోలో రష్మిక ముఖం కొద్దిగా కనిపించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
అయితే తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విడివిడిగా ఇటలీకి వెళ్లిన విజయ్ దేవరకొండ, రష్మిక… ఈరోజు మాత్రం జంటగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ (Hyderabad Airport)లో ల్యాండ్ అయ్యారు. ఇద్దరూ ఒకే విమానంలో వచ్చి, ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో బయల్దేరారు. ముందుగా విజయ్ వేగంగా నడుచుకుంటూ వెళ్లి కారెక్కగా, ఆ వెంటనే రష్మిక కూడా మెల్లగా నడుచుకుంటూ అదే కారులో కూర్చున్నారు. ఇద్దరూ మాస్కులు ధరించి ఉండటం గమనార్హం.
ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని రష్మిక ఒకానొక సందర్భంలో చెప్పింది. ఇదిలా ఉంటే, వచ్చే నెలలో ఉదయ్పూర్లోని ఓ ప్యాలెస్ హోటల్లో విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి జరగనుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.








