తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) GHMC పరిధిలో పాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పౌరులకు సేవలు వేగవంతంగా అందించడానికి జిహెచ్ఎంసి డీలిమిటేషన్ (GHMC Delimitation)కు సంబంధించిన తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నూతన విధానం ప్రకారం, భాగ్యనగరంలో ఉన్న 150 డివిజన్ల సంఖ్యను ఏకంగా 300కి పెంచారు.
కేవలం డివిజన్ల సంఖ్య మాత్రమే కాకుండా, పాలనా సౌలభ్యం (Administrative Convenience) కోసం ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కి, 30 సర్కిళ్లను 60కి పెంచారు. కొత్త జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ప్రాంతాలు ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. ఈ పునర్విభజనలో వార్డు స్థాయి కార్యాలయాల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు, ప్రస్తుత సర్కిల్ కార్యాలయాల్లో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రారంభ నోటిఫికేషన్ తర్వాత ప్రజల నుండి సుమారు 6,000కు పైగా అభ్యంతరాలు వచ్చినప్పటికీ, వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకోబడింది. నూతనంగా ఏర్పాటైన 12 జోన్ల పాలనా వ్యవస్థకు సమర్థులైన అధికారులను కమిషనర్లుగా నియమించారు. ఈ మార్పుల ద్వారా నగర పాలన మరింత పారదర్శకంగా, ప్రజల ముంగిట నేరుగా చేరుతుంది; మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.








