హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ (Actor Shivaji) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ‘దండోరా’ (Dandora) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీతో పాటు మహిళా సంఘాల్లో తీవ్ర అభ్యంతరాలను రేకెత్తించాయి. ఈ అంశంపై తెలంగాణ ఉమెన్ కమిషన్ (Telangana Women Commission) కూడా సీరియస్ కావడంతో, శివాజీ మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అయితే తన మాటల్లో వాడిన రెండు పదాలను తప్ప మిగిలిన స్టేట్మెంట్ (Statement)కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పడం సంచలనంగా మారింది.
మీడియా సమావేశంలో శివాజీ మాట్లాడుతూ, 30 ఏళ్ల సినీ ప్రయాణంలో తొలిసారిగా ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. తనకు తెలియకుండా కొన్ని పదాలు దొర్లాయని పేర్కొంటూ, తాను ఉపయోగించిన రెండు అన్పార్లమెంటరీ పదాల విషయంలో తెలుగు ఆడపడుచులందరికీ, టీవీలు, సోషల్ మీడియాలో తన మాటలు చూసిన ప్రతి ఒక్కరికీ చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు.
అయితే తాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో కూడా శివాజీ వివరించారు. ఇటీవల లులూ మాల్ (Lulu Mall)లో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఎదుర్కొన్న పరిస్థితి, సమంత విషయంలో జరిగిన ఘటనలను ఉదాహరణగా ప్రస్తావించారు. అనుకోకుండా బట్టలు జారితే ఆ వీడియోలు జీవితాంతం ఇంటర్నెట్లో ఉండిపోతాయని, అలాంటి సందర్భాల్లో హీరోయిన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమాజం నుంచి స్పందన రావడం లేదని అన్నారు. వారిపట్ల ఉన్న బాధ్యతతోనే తాను మాట్లాడానని, ఎవరికీ అవమానం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
“ఎవరు ఏ బట్టలు వేసుకుంటే నాకేంటి? కానీ బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు జాగ్రత్త అవసరం” అన్నదే తన ఆవేదన అని తెలిపారు. తన వ్యాఖ్యల్లోని ఆ రెండు పదాలను పక్కన పెడితే, మిగిలిన స్టేట్మెంట్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.
ఈ వివాదంలోకి నటి అనసూయ రావడంపై కూడా శివాజీ స్పందించారు. “అనసూయ, మీరు ఇందులో ఎందుకు ప్రవేశించారు? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా?” అంటూ ప్రశ్నించారు. గతంలో ఎన్నో దారుణ ఘటనలు జరిగినప్పుడు స్పందించని వారు, ఇప్పుడు ఎందుకు తననే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా నిద్ర లేకుండా తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని శివాజీ తెలిపారు. త్వరలోనే ఉమెన్ కమిషన్ను కలిసి తన వివరణ ఇస్తానని చెప్పారు.








