తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత్తలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తరాధి నుంచి వీస్తున్న శీతల గాలులతో ఉష్ణోగ్రత్తలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. చలికి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మూడు రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో 3.8°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఏజెన్సీ వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. జి.మాడుగులలో 4.1°C, డుంబ్రిగుడలో 6°C, జీకే వీధిలో 7.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత్తలు 5.2 డిగ్రీలకు పడిపోయింది. మంచిర్యాలలోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా వరంగల్, మెదక్ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హన్మకొండ, వరంగల్ జిల్లాల్లోనూ నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది.
చలితో పాటు ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. బుధవారం నుంచి చలి స్వల్పంగా తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.