హిందూపురంలో ఉద్రిక్తత.. వైసీపీ ఆఫీస్‌పై టీడీపీ దాడి (Videos)

హిందూపురంలో ఉద్రిక్తత.. వైసీపీ ఆఫీస్‌పై టీడీపీ దాడి

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడికి దిగిన ఘటన పెద్ద దుమారానికి దారితీసింది. శ‌నివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో వైసీపీ పార్టీ ఆఫీస్ పూర్తిగా ధ్వంసమైపోయింది.

వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఒకేసారి వైసీపీ కార్యాలయంపై దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను వైసీపీ బయ‌ట‌పెట్టింది. ఆఫీసులోని అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు మాజీ సీఎం దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆఫీస్‌పై దాడి అనంత‌రం అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలను కుర్చీలతో దాడి చేసిన ఘటన ఉద్రిక్తతను మరింత పెంచింది.

ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌పై హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జి దీపిక భర్త వేణురెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మనం ఎవడికిందో బానిసల బతుకులు బతుకుతున్నాం. ఎవడో హైదరాబాద్‌లో ఉంటే వాడి కింద మనం బతకాలా?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్నిపుట్టించాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలే టీడీపీ కార్యకర్తల దాడికి కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

గ‌తంలో వైసీపీ అధికారంలో ఉండ‌గా ఇలాంటి దాడులు ఎప్పుడైనా హిందూపురంలో జ‌రిగాయా అని ప్ర‌శ్నిస్తున్నారు. దాడి జ‌రుగుతున్న‌ట్లుగా స‌మాచారం అందినా, పోలీసులు అంతా అయిపోయాక వ‌చ్చార‌ని ఘ‌ట‌నా స్థ‌లంలో ఉన్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తున్నారు. ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయ‌ని అనుకోవ‌ద్ద‌ని, జ‌గ‌న్ 2.0లో ప‌రిస్థితులు వేరుగా ఉంటాయ‌ని దీపికా భ‌ర్త వేణురెడ్డి హెచ్చ‌రించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment