తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయ హే తెలంగాణ’ సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఆత్మస్వరూపాన్ని ప్రతిబింబించిన అందెశ్రీ మరణం సాహిత్య ప్రపంచానికి, తెలంగాణకు తీరని లోటుగా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ దశలో ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతం రాష్ట్ర ఆవిర్భావానికి చిహ్నంగా నిలిచింది. ఆ పాటలో తెలంగాణ ప్రజల తపన, గౌరవం, చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించాయి. తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారిక గుర్తింపు పొందిన ఈ కవిత అందెశ్రీని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపింది. మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు అనే మాటను రాసిన మహాకవి అందెశ్రీ అని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
కవితా ప్రపంచంలో తన ప్రత్యేక శైలితో, లోతైన భావప్రకటనతో అందెశ్రీ అనేక మందికి ప్రేరణగా నిలిచారు. ఆయన మృతి పట్ల సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాల నుంచి సంతాపం వెల్లువెత్తుతోంది. తెలంగాణ గౌరవ గీతకారుడు అందెశ్రీ గేయాలు, కవితలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రముఖులు పేర్కొన్నారు.








